Saturday, 2 April 2016

అనుబంధాలు, స్మరణ (స్వీయలేఖ)


ఈ భాగవతపద్యం చూడండి-

అపి స్మరతి నః కృష్ణో మాతరం సుహృదః సఖీన్
గోపాన్ వ్రజం చాత్మనాథం గావో వృందావనం గిరిం 10.46.18

      కృష్ణుడు మమ్మలిని, తన తల్లి యశోదను, బాంధవులను, స్నేహితులను, గోపకులను, తనే ప్రాణమైన ఈ వ్రజాన్ని ఆలమందలను, బృందావనాన్ని, గోవర్ధనపర్వతాన్ని తలుస్తున్నాడా?

          కృష్ణుడు పంపగా నందవ్రజానికి వెళ్ళిన ఉద్ధవుడిని నందుడు ఎంతో ఆదరించి తన పుత్రుని గురించి ఈ ప్రశ్న అడుగుతాడు. కృష్ణుడు వారితో ఆడి, పాడి, అల్లరి చేసి, ఆనందింపచేసి వెళిపోయాడు. ఇక్కడ ప్రతివారు ఆయనను తలుచుకుంటున్నారు. కానీ ఆయన కూడా తలుచుకుంటున్నాడా లేదా?- అని నందుని కుతూహలం, ఆరాటం.
          ఎందుకంటే అనుబంధాలలో స్మరణ ఎంతో ముఖ్యమైనది. మనం తలుచుకునేవారు మనలను కూడా తలుచుకుంటున్నారంటే అది కాస్త ఊరటగా ఉంటుంది. మనకు మఖ్యులైనవారిని, వర్తమానంలో మనతో సంపర్కంలో ఉన్నవారిని, పనికి వచ్చేవారిని, మనం ప్రేమించేవారిని సహజంగానే నిరంతరం తలుచుకుంటాము. దానికి ఎవరూ చెప్పనవసరం లేదు. కానీ దూరమైన బంధాలు, చిన్ననాటి బంధాలు, మాత్రం పెద్దగైనాక అంత సహజంగా ఇమిడిపోయేవిగా అనిపించవు. మనకు అనిపించినంతమాత్రాన అవి ఉండకుండా పోవు. కనీసం మనతో లౌతైన అనుబంధం ఏర్పరుచుకున్న అవతలివారి విహ్వలతా భావన తెలుసుకుని, అయినా దాన్ని బట్టి మన ప్రవర్తనను చూసుకోవాలి. అసలు ఉద్ధవుడు వ్రజానికి రావటమే కృష్ణుడు వారిని తలుచుకుంటున్నాడని చెప్పి ధైర్యం కలిగించటానికి. అయినా నందుడికి లోపల ఏదో ఆశ్వాసన కోరుకునే భావన. కృష్ణుడూ తమను అంతే ఇదిగా స్మరిస్తాడంటే అదొక హృదయంలో మధురభావన. అంతే.

గోమాత డెక్కల ధూళి



ఒక మంచి మాట- 
ఈ భాగవతపద్యం చూడండి-
ప్రాప్తో నందవ్రజం శ్రీమాన్ నిమ్లోచతి విభావసౌ
ఛన్నయానః ప్రవిశతాం పశూనాం ఖురరేణుభిః ॥10.46.8
అనువాదం- ఉద్ధవుడు సూర్యుడు అస్తమించుచుండగా వ్రజాన్ని చేరాడు. గోగణాల యొక్క డెక్కల వల్ల రేగిన ధూళితో కప్పబడిన రథముగలవాడై, వ్రజగోవుల పాదరేణువులవల్ల కలిగిన పుణ్యమే సంపదగా కలవాడై నందవ్రజాన్ని ప్రవేశించాడు.
కృష్ణుని సందేశం తీసుకొని, ఉద్ధవుడు మధుర నుండి వ్రజానికి వచ్చినప్పుడు ఆయన రథానికి, ఒంటికి అంతా దుమ్ము అయింది. అయితే అది పవిత్రమైన గోవులుతిరగాడే భూమి. కనుక ఆ ధూళి గోధూళి. అది ఒంటిమీద పడినందుకు ఉద్ధవుడు బాధపడలేదు. పైగా సంతోషపడ్డాడు. గర్వించాడు. తనను తాను ధన్యుడుగా భావించాడు. అంటే వాటి డెక్కల ధూళి కూడా అంత పుణ్యాన్ని, మానసికానందాన్ని కలిగించే శక్తి కలది అని తెలుస్తుంది. అటువంటి భావనను మనలో నింపే గోవులు అంతటా తిరగాడిన భూమి భారతభూమి. కానీ ఈనాడు పూజించుకొందామన్నా ఒక్క దేశీగోవు దొరకటం కష్టమైపోతోంది. కనీసం ముందుగా మన హైందవ పారంపరిక సంపదలలో ఒక్క గోమాతను కాపాడుకోగలిగినా చాలు.. హైందవులు తిరిగి శక్తిని పుంజుకోగలరు. వందే గోమాతరం.